Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి తన కార్యాలయంలో శనివారం ఎంపీ సీఎం రమేష్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. జీవితాంతం నా రాజకీయ భవిష్యత్తు అంతా అనకాపల్లిలోనే కొనసాగిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు లో 21 మంది ఎంపీలతో కీలకపాత్ర పోషించనున్నామనీ తెలిపారు. గడచిన ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీలో అరాచక పాలన సాగిందనీ విమర్శించారు. ప్రజా సొమ్మును వారు ఇష్టానుసారం దోచుకున్నారనీ అన్నారు.గత ప్రభుత్వ పాలనలో జరిగిన ప్రతి ఒక్క అవినీతిపై పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రికి రాతపూర్వక ఫిర్యాదు చేస్తానన్నారు. రాష్ట్రంలో లిక్కర్ పాలసీ, మైనింగ్ కార్పొరేషన్ లో భారీ అవినీతి జరిగిందనీ దీనిపై పూర్తి విచారణ చేస్తామని అన్నారు. డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులు వాసుదేవ రెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి , మధుసూదన రెడ్డి తోపాటు పదిమంది ఐపీఎస్ అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ వీళ్ళందర్నీ చట్టబద్ధంగా శిక్షిస్తామని అన్నారు. వారందరిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి ఖచ్చితంగా శిక్షపడేలా చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులు ఇప్పటికే దొడ్డిదారిన పారిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవర్ని వదిలిపెట్టేది లేదనీ అన్నారు. భవిష్యత్తులో ఏకాభిప్రాయంతో కూటమి ముందుకు వెళుతుందనీ వైసిపి పార్టీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కూటమిలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వారిని చేర్చుకునేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్, బిజెపి పార్టీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అనకాపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV