Rapid TV - Andhra Pradesh / Anakapally : మహాత్మాగాంధీ పాటించిన సత్యం, ధర్మం, అహింసా మార్గాన్ని మనమంతా అనుసరించాలి.. మహాత్ముని ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలి.. టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్.. అనకాపల్లి, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ పాటించిన సత్యం, ధర్మం, అహింసా మార్గాన్ని మనమంతా అనుసరించాలని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు దాడి రత్నాకర్ కోరారు. ఈ మేరకు మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకొని స్థానిక జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో గల మహాత్మాగాంధీ విగ్రహానికి మంగళవారం ఉదయం దాడి రత్నాకర్ పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ నేడు మన దేశ ప్రజలంతా ఎంతో ప్రశాంతంగా శాంతియుతంగా జీవించగలుగుతున్నామంటే దానికి కారణం మహాత్మాగాంధీ యే కారణం అన్నారు. గాంధీ అందించిన సేవలు, ఆయన అనుసరించిన సిద్ధాంతాలు, అహింసా మార్గం కేవలం మన దేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు అనుసరించే విధంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదన్నారు. ఆనాడు సత్యాగ్రహం ద్వారా పోరాటం చేపట్టి మన దేశ ప్రజలను బానిసలుగా చేసుకున్న బ్రిటీస్ వారిని దేశం నుంచి వెల్లగొట్టారన్నారు. అటువంటి మహాత్ముని జీవిత చరిత్ర నేడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పాఠ్యాంశాలుగా చేర్చారంటే ఆయన గొప్పతనం ఏంటనేది అర్థం చేసుకోవచ్చన్నారు. అలాగే ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలో టెక్సాస్లో గాంధీ విగ్రహం ఏర్పాటుతోపాటు ఆయన పేరుతో ఒక పార్కును ఏర్పాటుచేసి అత్యున్నత గౌరవం ఇచ్చి గాంధీ విశిష్టతను గొప్పతన్నాన్ని చాటిచెప్పారని గుర్తు చేశారు. భాతరదేశంలో గల ప్రజలందరినీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యపరచి అనేక మార్గాల ద్వారా పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని, ఆయన చేపట్టిన శాంతియుత పోరాటం నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిదన్నారు. అలాగే ఉప్పు సత్యాగ్రం పేరుతో మొట్టమొదటిసారిగా 24రోజులపాటు 388 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి దీనిలో భారతీయులంతా పాల్గొనేలా పోరాటంచేసి ఉప్పుపై ట్యాక్సు లేకుండా చేసిన ఘనత మహాత్మాగాంధీకే దక్కుతుందన్నారు. ఇలా అనేక ఉద్యమాలు, పోరాటాలుచేసి మన దేశానికి తీసుకువచ్చిన స్వాతంత్య్రం కాపాడుకోవాలంటే మనమంతా ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే మహాత్మునికి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని రత్నాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిలపరశెట్టి బాబీ, కొత్తా గోపాలకృష్ణ, ఆళ్ల ప్రవీణ్కుమార్, వియ్యపు శ్రీనివాస్యాద్, కటారి దేముడు, పలకా కాసులు, యల్లపు శ్రీను, రేబాక ఇంద్రకుమార్, దొడ్డి రమణ, మళ్ల రామచంద్రరావు, నందవరపు కుమార్, వేగి పవన్కుమార్, డీవీఎన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Rapid TV