Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి : నర్సీపట్నం. మాకవరపాలెం మండలం భీమ బోయిన పాలెంలో రూ.1.68.02 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతుల భవనాల కోసం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు భీమ బోయిన పాలెం కేజీవీబీ కళాశాల లో సోమవారం భూమి పూజ చేశారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏడాది కాలంలో నియోజకవర్గంలో రూ. 97 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున నిధులు ఖర్చు చేయగలిగితే నాలుగేళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండానే మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారని, అయితే ఆ కాలేజీని అలా వదిలిపెట్టకుండా కార్పొరేట్ సంస్థలతో చర్చించి పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీఇచ్చారు నర్సీపట్నంలో డిగ్రీ కాలేజ్ మొదలుకొని ఇంజనీరింగ్ కాలేజ్ వరకు తెదేపా హయాంలోనే వచ్చాయని అన్నారు. విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని స్పీకర్ అయ్యన్న అన్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత అయిన విద్యార్థినిలను అభినందించారు.పది నెలల కాలంలో మాకవరపాలెం మండలానికి రూ.10 కోట్ల 70లక్షల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులు 30 పంచాయతీ లలో చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక స్మశాన వాటిక నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. భీమ బోయినపాలెం పంచాయతీలో సీసీ రోడ్లు మరియు అభివృద్ధి పనులకు కోటి 5 లక్షల రూపాయలతో పూర్తి చేసినట్లు తెలిపారు. మాకవరపాలెం మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ద్వారా 113 పనులకు గాను సుమారు 10 కోట్ల 70లక్షల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కస్తూరిబా పాఠశాల వద్ద నుండి విశాఖపట్నం ప్రధాన రహదారి వరకు వీధిలైట్లు ఏర్పాటుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాప్, సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఆర్ వై పాత్రుడు, జనసేన కన్వీనర్, వెలమ కోఆపరేటివ్ డైరెక్టర్ సూర్యచంద్ర, గ్రామ సర్పంచ్ రుత్తల నందకిషోర్, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామనాయుడు, అధికారులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV