Rapid TV - Andhra Pradesh / Anakapally : దుర్గాదేవి ఆలయంలో కుంకుమ పూజలు యలమంచిలి : శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని యలమంచిలి మండలం, పద్మనాభరాజు పేట గ్రామంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి వారం కావడంతో అమ్మవారిని, ఆలయాన్ని పసుపు కొమ్ములు, గాజులతో అలంకరించారు. ఇందులో భాగంగా పీ ఎన్ ఆర్ పేట, బయ్యవరం ఉభయ గ్రామాలకు చెందిన పలువురు భక్తులు భక్తి శ్రద్ధలతో పసుపు కొమ్ములు, గాజులను తీసుకొని వెళ్ళి కమిటీ సభ్యులకు సమర్పించడంతో, వాటితో వారు ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అర్చకులు గౌరీ శంకర్ శర్మ మంత్ర ఉచ్చరణ నడుమ తెల్లవారి నుంచి దుర్గాదేవి అమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. తరువాత మధ్యాహ్నం వరకు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో హరి భజన చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మొగ్గా బుజ్జి, జెర్రిపోతుల నానాజీ, రాయివరపు వెంకట్, మొల్లి అప్పారావు, కలిగట్ల నానాజీ, వై నాగేశ్వరావు, వై జానకి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV