Rapid TV - Andhra Pradesh / Anakapally : కూటమి విజయంతో అభివృద్ధికి బాటలు.. ఎంపీ సిఎం రమేష్... అటు దేశంలోనూ,ఇటు రాష్ట్రం లోనూ ఎన్డీయే మిత్రపక్షాలతో కూడిన కూటమి విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో అభివృద్ధికి బాటలు వేసినట్లయిందని అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ అన్నారు. సోమవారం ఉదయం చోడవరం శివాలయం దగ్గర నిర్వహించిన చోడవరం నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్రం లోనూ,రాష్ట్రం లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో కి రావడం మూలంగా రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యునిగా తనను, పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కూటమి అభ్యర్థుల విజయానికి అహోరాత్రులూ శ్రమించిన టిడిపి,జనసేన, బిజెపి పార్టీల నాయకులకు,కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని రమేష్ భావోద్వేగంతో అన్నారు.అందరి సేవలనూ గుర్తు పెట్టుకుంటామని తెలిపారు. చోడవరం నియోజకవర్గ శాసన సభ్యులు కేఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తన గెలుపుకు కృషిచేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగిన సిఎం రమేష్ వంటి వ్యక్తి అనకాపల్లి ఎంపీ గా గెలుపొందడం వలన ఈ ప్రాంతాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు.ఈ సందర్భంగా సిఎం రమేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు,చోడవరం జనసేన నాయకులు పీఎస్ ఎన్ రాజు..తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV