Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తిప్పికొట్టాలి - ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా నడుం బిగించాలి - ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకున్నప్పడే ఇది సాధ్యం - విజయవిహారం ఎడిటర్ రమణమూర్తి పిలుపు అనకాపల్లి: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఎన్నికలే అతి పెద్ద పండుగని విజయవిహారం ఎడిటర్ ఖదిజ్ఞాసి రమణమూర్తి అన్నారు. స్వచ్ఛ, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగినప్పుడే దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగానికి ప్రతిఫలమని స్పష్టం చేశారు. జైభారత్ జస్ట్ ఓట్ ఏపీ-2024 ఎన్నికల చైతన్య రాష్ట్రస్థాయి సమావేశాన్ని పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన జైభారత్ కార్యకర్తలు ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి, సమావేశ మందిరం వరకు ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను డబ్బు, కులాలే శాస్తున్నాయని తెలిపారు. అట్టడుగు వర్గాలకు చెందిన ఎంతోమంది మేధస్సు, నాయకత్వ లక్షణాలు, ప్రజలకు మేలు చేయాలనే ఉన్నత లక్ష్యాలు ఉన్నా.. ప్రస్తుత రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా ఉన్నపుడే హక్కులు సాధించుకోగలం.. ఎన్నికల్లో ప్రలోభాల పర్వమే కీలకంగా మారిందని రమణమూర్తి గుర్తు చేశారు. ఖర్చు చేయగలిగే సామర్థ్యం ఆధారంగానే పార్టీలు కూడా అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నాయని, ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదమని తెలిపారు. ఓటుకో, మద్యానికో ఓటు హక్కును అమ్ముకోవడం వల్ల ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారని పేర్కొన్నారు. ముందుగా ఓటరు నిజాయితీగా ఉన్నపుడే రాజకీయ నాయకులు, సమాజం మార్పు తీసుకు రాగలమని సూచించారు. దీనిపై ఓటర్లను చైతన్యవంతం చేస్తూ జైభారత్ దేశవ్యాప్తంగా గత 20 ఏళ్లుగా చైతన్య శిబిరాలు, పోస్టర్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా సాగిస్తున్న ఈ పోరాటంలో ప్రజలు, అభ్యుదయ వాదులు కలిసి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మానెం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఖదిజ్ఞాసి రాఘవదాసు, ఉపాధ్యక్షులుగా గరిప్రసాద్, నూర్ అహ్మద్, దార్ల చంద్రిక, జట్టు పద్మజ, డి.రమణరాజు, సయ్యద్ పర్వేజ్, కార్యదర్శిగా పి రామకృష్ణ, ఎస్.వెంకట్, పి.కార్తికేయ, కోన బాబూరావు, శ్రీదేవి రెడ్డి, మీసాల రాము, కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 6 భాషల్లో పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. జైభారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి రమణ, జైహో ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి త్రిమూర్తులు, ఆంధ్రప్రదేశ్, జైభారత్ జాతీయ కార్యదర్శులు ఖదిజ్ఞాసి రజని, ఖదిజ్ఞాసి లోక్ నాథ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
Admin
Rapid TV