Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: చరకాం గ్రామంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం... ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్ కళ్ళ డాక్టర్ పి. దేవిప్రభాకర్ తెలిపారు. కూటమి నాయకులు చిట్టంరెడ్డి ఈశ్వరరావు, పైలా నూకరాజు, యడ్ల నాయుడు, బండారు అప్పారావు గార్ల ఆధ్వర్యంలో సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్ అనకాపల్లి, రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి అనకాపల్లి, శంకర్ ఫౌండేషన్ విజన్ సెంటర్ వారి సహకారంతో కసింకోట మండలం చరకాం గ్రామంలో ఆదివారం ఉచిత కంటి మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ ఉచిత కంటి మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ కళ్ళ డాక్టర్ పి.దేవిప్రభాకర్ మాట్లాడుతూ ఈరోజుల్లో రేడియేషన్, పొల్యూషన్ వల్ల కంటిపొర, చూపు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరు 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలను చేయించుకోవాలని అన్నారు. కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే సరైన ఆహారం పదార్థాలు తీసుకోవాలని, రోజు ఆరు నుండి ఏడు గంటలు పడుకోవాలని అన్నారు. కంటి చూపు మందగించకుండా ఉండటం కోసం మద్యపానానికి, దూమపానానికి దూరంగా ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్టoరెడ్డి ఈశ్వరరావు మాట్లాడుతూ మన గ్రామంలో జరుగుతున్న ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రామ్కీ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి అధినేత, సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్ ట్రస్టీ పూసర్ల రాజా మాట్లాడుతూ సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ ను తాళ్లపాలెం స్థాపించామని అక్కడ ప్రతి సోమవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రకముల వ్యాధులకు ఉచితంగా చికిత్సలు, పరీక్షలు చేస్తున్నామని, అవసరమైన వారికి సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఉచిత మందులు ఇస్తున్నామని అన్నారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి శంకర్ ఫౌండేషన్ కoటి ఆసుపత్రి విశాఖపట్నంలో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని అన్నారు. ఈ ఉచిత కంటి మెగా వైద్య శిబిరంలో 85 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 29 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. కళ్లద్దాలు అవసరమైన వారికి సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా అతి తక్కువ ధరలకు కళ్లద్దాలు అందిస్తున్నామని పూసర్ల రాజా తెలిపారు. తమ గ్రామాలలో మరియు ఎక్కడైనా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించాలంటే తనను 903 222 3330 సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ లు సతీష్, సాయి మరియు పైలా నూకరాజు, యడ్ల నాయుడు, బండారు అప్పారావు మరియు కూటమి నాయకుల కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
Rapid TV