Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ: నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయండి:: తెదేపా నాయకులు దాడి రత్నాకర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేత నియమింపబడిన వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని లక్ష్మీనారాయణ నగర్లోని డి.వి.ఆర్. కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి హయంలో నామినేటెడ్ పదవులు పొందినవారు ఆ ప్రభుత్వం మారిపోయినపుడు తమ పదవులను వదులుకోవడం నైతిక బాధ్యతని అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి పదవులలో చాలామంది కొనసాగడం అనైతికమని అన్నారు. న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో న్యాయవాదులుగా నియమించబడినవారు కూడ తమ పదవులకు రాజీనామా ఇచ్చి కొత్త ప్రభుత్వం తమ అడ్వకేట్లను నియమించుకునే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర కమిషన్లు, కార్పొరేషన్లు, సామాజిక వర్గాల కార్పొరేషన్లు, జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా కో`ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు, ప్రాధమిక సహకార బ్యాంకులు, మార్కెటింగ్ కమిటీలు, దేవాలయాల ట్రస్టు బోర్డులు మున్నగు సంస్థల నామినేటెడ్ సభ్యులు తమ పదవులను ఇంకా అంటిపెట్టుకుని ఉండటం వారికే అవమానకరమని అన్నారు. రాజీనామాలు చేయని అనైతిక సభ్యులను గుర్తించవద్దని, వారికి సహకరించవద్దని అధికారులను కోరారు. నామినేటెడ్ పదవులు పొందిన కొందరు పార్టీ మారి మా కూటమి పార్టీల్లోకి చేరినప్పుడు వారి పదవులకు రాజీనామాలు చేసివుండాలనేది తమ పార్టీల విధానమని అన్నారు. అటువంటివారు గత ప్రభుత్వం ఇచ్చిన పదవుల్లో కొనసాగకుండా రాజీనామాలు చేసి, నూతన ప్రభుత్వం నామినేటెడ్ పదవులను నింపుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కూటమి పార్టీల నాయకులు సమిష్టిగా నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రతిపాదనలను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని, ప్రభుత్వం వారు ఆయా పదవులను అర్హులకు నామినేట్ చేస్తారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 40శాతం మంది మాత్రమే రాజీనామా చేశారని, మిగతావారు కూడ తమ నామినేటెడ్ పదవులకు రాజీమానాలు సమర్పించాలని కోరారు. పాలకవర్గంగా భావించి పనులను గాని చేస్తే అధికారులు కూడ తప్పుచేసినట్టు అవుతుందని, అధికారులు కూడ పాత బోర్డులను, పాలకవర్గాలను కూడ ఎట్టి పరిస్థితుల్లోను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులకు దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు.
Admin
Rapid TV