Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నం అభిద్ సెంటర్ లో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు, యువత, కళాశాలల విద్యార్థినులు తరలివచ్చారు. సభ ప్రారంభంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. అధికారులు, మహిళలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అబిద్ సెంటర్ నుండి శ్రీ కన్య సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరికీ మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాలపై ఒక అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడేలా చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి పై పోలీసు శాఖ ఉక్కు పాదం మోపిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో 5 శాశ్వత చెక్ పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నర్సీపట్నం ప్రాంతంలోని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటలు ప్రత్యేక సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపడుతూ, గంజాయి రవాణాను అరికడుతున్నామన్నారు.
2025 సంవత్సరంలో ఇప్పటివరకు గంజాయి అక్రమ రవాణాపై 74 కేసులు నమోదు చేసి 237 మందిని అరెస్టు చేసామన్నారు. 4903 కిలోల గంజాయి, 5.39 లీటర్ల ఆషిస్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 59 వాహనాలను సీజ్ చేశామన్నారు. గంజాయి కేసులలో తప్పించుకు తిరుగుతున్న 67 మంది ముద్దాయిలను అరెస్టు చేసామన్నారు .డ్రోన్ కెమెరాల ద్వారా ప్రతిరోజూ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు . అలాగే డాగ్ స్క్వాడ్ ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి రవాణాను అరికడుతున్నామన్నారు. ఎన్ డి పి ఎస్ యాక్ట్ ద్వారా ఆస్తులు జప్తు ప్రక్రియ ప్రారంభించామన్నారు. "సంకల్పం" కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ, స్కూళ్లు, కళాశాలల లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయికి బానిసలు అయిన వారిని డి ఎడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స చేయిస్తూ బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో ఈగిల్ సెల్ ఏర్పాటుచేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కళాశాలల్లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటుచేసి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి వి రమణ, తహసిల్దార్ ఎల్ రామారావు, మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర, పట్టణ, రూరల్ సిఐలు జి గోవిందరావు, ఎల్ రేవతమ్మ, ఎక్సైజ్ సీఐ సునీల్ కుమార్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, జడ్పిటిసి సుకల రమణమ్మ, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన సూర్యచంద్ర, డాక్టర్ జ్యోతి, ఎస్సైలు, పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV