Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : ఇటీవల కాలంలో పోలీసులు గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపుతుండడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త రవాణా విధానాలు అవలంబిస్తున్నారు. మంగళవారం కారు వెనుక సీటు క్రింద ప్రత్యేకంగా తయారు చేసిన అరలో తరలిస్తున్న గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో అందించిన వివరాల ప్రకారం గంజాయి రవాణా పై రాబడిన ఖచ్చితమైన సమాచారం పై పట్టణ ఎస్సై జి ఉమామహేశ్వరరావు పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట వాహనాలు తనిఖీ చేపట్టారని, ఉదయం పదిగంటల సమయంలో చింతపల్లి వైపు నుండి వస్తున్న టి ఎన్ 69 బి బి 9074 నెంబరు గల ఇండికా కారులో వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి కొద్ది దూరంలో కారును ఆపి కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారని, అది గమనించిన ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బంది సహాయంతో వారిని పట్టుకొని, కారును తనిఖీ చేయగా కారు వెనుక సీటు క్రింద ప్రత్యేకంగా తయారుచేసిన ఒక అరలో దాచి ఉంచిన ఐదు ప్యాకెట్లలో ఉన్న 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఇండికా కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.8 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నామని డి.ఎస్.పి తెలిపారు . జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ శ్రీనివాసరావు లకు డి.ఎస్.పి నగదు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ జి గోవిందరావు, పట్టణ ఎస్సైలు జే రమేష్, జి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
Reporter
Rapid TV