Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : అక్టోబర్ 4 నుండి మూడు రోజులపాటు గొలుగొండ మండలం ఏ ఎల్ పురం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీమతి ఎల్ రేవతమ్మ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం ఆమె ఏ ఎల్ పురం హైస్కూల్ ను సందర్శించారు. క్రీడాకారులకు వసతి, త్రాగునీరు, ఇతర సదుపాయాలపై ఉపాధ్యాయులతోనూ, స్కూల్ కమిటీ సభ్యులతోను చర్చించారు. ఈ సందర్భంగా రేవతమ్మ మాట్లాడుతూ, వచ్చేనెల 4 నుండి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ స్పీకర్, జిల్లా ఎస్పీ, డి.ఎస్.పి హాజరవుతారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన గడ్డమీద ఈ పోటీలు జరగడం స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి 13 జిల్లాలలో ఒక్కో జిల్లా నుండి రెండేసి టీములు ( బాలురు బాలికలు) పాల్గొంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా విజయవంతం చేసి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ ఎస్సై పి రామారావు, నాతవరం ఎస్సై వై తారకేశ్వరరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లగుడు రాజు, ప్రధానోపాధ్యాయులు కృష్ణ ప్రసాద్, పి డి నర్సింగరావు, జి మాధవి, ఉపాధ్యాయులు లోచల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV