Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి, నర్సీపట్నం : ఈనెల 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వర్కర్స్ యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జీతాలు పెంచాలనే తమ ప్రధానమైన డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. 13వేల చాలీచాలని జీతంతో కుటుంబ జీవనం భారంగా మారిందని, మున్సిపాలిటీలోని ఇతర శాఖల కార్మికుల మాదిరిగానే తమకు జీతాలు పెంచాలని యూనియన్ అనకాపల్లి జేఏసీ అధ్యక్షుడు గొర్లె మురళీకృష్ణ డిమాండ్ చేశారు. తమ సమ్మె మూలంగా మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, సహృదయంతో ప్రజలు మా బాధలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని నర్సీపట్నం శాఖ అధ్యక్షుడు మాకిరెడ్డి అప్పలనాయుడు, కార్యదర్శి కరక మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కరక రామకృష్ణ, యర్రా ప్రకాష్, కోశాధికారి లాలం నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV